సామాన్యుడి సింహాసనం ... (సరదాకి ఓ పిడకల వేట)

సామాన్యుడి సింహాసనం ... (సరదాకి ఓ పిడకల వేట)
****************************************************
     నిన్న 'మా' టీవీ చూస్తోంటే మధ్యలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంకు సంబంధించి ప్రకటన వచ్చింది. (చాలా రోజుల్నించి వస్తూండచ్చు లేదా ఇంతకు ముందటి భాగాలలో కూడా వచ్చిండవచ్చు, కానీ నేను ఇప్పుడే చూశాను/గమనించాను) అందులో నాగార్జున అంటాడు 'ఇది సామాన్యుడి సింహాసనం' అని. ఎందుకో నాకు అది అసంబంద్ధంగా అనిపించింది. అది సామాన్యుడి సింహాసనం ఎలా. యే ప్రాతిపదికన అవుతుంది. సామాన్యుడు అని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? అంటే వారు ఇచ్చిన టెలిఫోన్ నంబర్స్ కు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్ ని సామాన్య, అసామాన్య వర్గాలుగా విడదీస్తారా? లేక కుల, మాట ప్రాతిపదికన నిర్ణయిస్తారా? లేక ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే అందులో మహిళలకు, వికలాంగులకు, వెనుకబడిన వర్గాలను తగిన ప్రాధాన్యత లభిస్తోందా? ఎన్ని ప్రశ్నలకని సమాధానం వెతకాలి? ఏ ఒక్కదానికి నాకు సమాధానం దొరకలేదు. కార్యక్రమ నిర్వాహకులను ఎలా సంప్రదించాలో తెలీట్లేదు - ఈ సమాచారం అర్.టి.ఐ చట్టం పరిధిలోకి వస్తుందేమో తెలుసుకోవాలి. ఒకవేళ ఈ సమాచారం అర్.టి.ఐ చట్టం పరిధిలోకి వస్తుంది అంటే వెంటనే తగిన వివరాల కోసం దరఖాస్తు చెయ్యాలి.
    ఈ పిడకల వేట ఏంటి, నచ్చితే చూడు లేకపోతే మానేయ్ అంటారా? మీకేంటి ... నా భయాలు నాకున్నాయండీ. వారు పరిగణించే ప్రాతిపదికన నేను సామాన్యుడు కాదు అని రేపు ఎవరేనా అంటే, నా సామాన్యత్వం గతి ఏమి కాను? లేదా సామాన్యుడివే అని ఎవరేనా అంటే, ఇన్నాళ్ళు గోప్పోడినే అనుకుంటూన్న నా గొప్పతనం ఏమి కాను? ఈ ప్రశ్నలన్నీ బుర్ర తొలిచేస్తూంటే నిద్రలేకుండా గడిపిన రాత్రికి ఎవరు సమాధానమిస్తారు? ప్రభుత్వమా, 'మా' టీవీ యాజమాన్యమా, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమ నిర్వాహకులా - ఎవరు, ఎవరు చెబుతారు సమాధానం? ఈ మధ్యనే ఎవరో ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా చూసాను - ఈ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కార్యక్రమానికి సంబంధించి జరిగి ఎస్సెమ్మెస్ పోటీలలో ఆ మొబైల్ కంపనీలకు లాభం ఎంత, అందులో గెలిచినోడికి వచ్చేది ఎంత అని రమారమి అంచనాలతో వివరాలు ఇచ్చారు. ఒకటో వంతో రెండో వంతో గెలిచినా వాడికి వస్తే దాదాపు 99% వంతులు ఆయా కంపనీలకువెళుతుంది. అంటే అక్కడ సామాన్యుడు నష్టపోతున్నాడే కానీ లాభపడట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, ఎన్ని ఎస్సెమ్మెస్లు పంపుతున్నారు, ఎంత సమయం వృధా చేస్తున్నారు (కార్యక్రమం చూడటం సంగతి తరువాత - నేను ఇక్కడ చెప్పేది దానిలో పాల్గొనటం కోసం ప్రయత్నాల గురించి) - ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే మరి అది సామాన్యుడి సింహాసనం ఎలా అవుతుంది. ఎంతో కొంతమంది సామాన్యుల నడ్డి విరుస్తున్న గుదిబండ లాంటి బరువే తప్ప.
    అయ్యా నాగార్జున గారూ ... ఈ రాత గనక మిమ్మల్ని చేరితే, మీరు నా ప్రశ్నలకు సమాధానమిచ్చి, భయాలను తొలగించగలరని మనవి చేసుకుంటూన్నాను. ఇంతకీ నేను సేప్పోచ్చేదేమిటంటే, ఏ కోశానా ఇది సామాన్యుడి సింహాసనం కాదు కాబట్టి ఆ పద ప్రయోగాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను అంతే కాక ఇన్నాళ్ళూ వాడినందుకు వివరణ ఇస్తూ నాలాంటి సామాన్యులకు (???) నష్ట పరిహారం చెల్లించాలని కూడా మనవి చేసుకుంటా ఉన్నాను.
    వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ - ఇది సదివినోల్లకి నేను ఏమి సెప్తున్నానంటే దీన్ని సరదాగా తీసుకోండి; సదవనోల్లకి ఏమి సెప్పాలి - వాళ్లకి సెప్పడానికి ఏముందని ఎలాగూ సదవలేదు కదా.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన