సంయమనం

ఏంటో - పెద్దాయన, జాతిగొట్టాలు, మరికొందరు తెగ ఆందోళన పడిపోతున్నారు. 'విశాఖను తగలబెట్టటానికి అనుమతివ్వాలా?' అని ఊగిపోయారు, ఇలా చేస్తే పెట్టుబడిదారులు వస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలున్నాయా?
-> గతంలో అనగా చరిత్ర కాలం కాదులెండి 2004 తరువాత నుండి 2014 వరకూ తమరు అయినదానికి కానిదానికీ రోడ్డెక్కి ఆందోళన బాట పెట్టినపుడు పైన పేర్కొన్న విషయాలు గుర్తుకు రాలేదా? లేక అప్పుడు సబబు అనిపించినవి ఇప్పుడు కాదనిపిస్తున్నాయా. నిరసన వ్యక్తం చేయటం అన్నది రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు. ప్రతిపక్ష నేతను, రాజకీయ నేతలను రానివ్వకుండా అడ్డుకోండి; అది శాంతిభద్రతల కోసమో మరెందుకో అనుకుంటారు. మరి ఎటువంటి పార్టీ జెండాలు లేకుండా శాంతియుత నిరసన వ్యక్తం చేయటానికి ప్రయత్నించిన యువతను, నిరసనకారులను అడ్డుకోవడం ఎందుకు? 

-> ఆందోళన యే విషయంగా చెయ్యాలని ప్రజలు ఉద్యమించజూశారు? ఎన్నికల సమయంలో తమరు నొక్కి వక్కాణించి, అది వస్తే ఎంత మేలో వివరించి చెప్పిన 'ప్రత్యేక హోదా' గురించే కదా. తదనంతర పరిణామాల నేపథ్యంలో (ఓటుకు నోటు లేదా మరేవైనా కావచ్చు) తమరు హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అంటున్నారు. ఎలా, ఐ మీన్ హౌ? హోదా వస్తే రాయితీలు వస్తాయి, ప్యాకేజీ అంటే డబ్బులు వస్తాయి. డబ్బులు ఎలా తినాలో రాజకీయనాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదని మాకందరికీ తెలుసు. అందుకే డబ్బులొద్దు, హోదా కావాలంటున్నాం. అయినా మీరు చెప్పే ప్యాకేజీకి చట్టబద్ధత ఉందా, చెప్పినవన్నీ ఇస్తారన్న నమ్మకం ఉందా? సాక్షాత్తూ అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీకే చట్టబద్ధత లేదని సదరు భాజపా వారు సెలవిచ్చి ఉండిరి. మరి వారు పత్రికా సమావేశంలో వాక్రుచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత ఉంటుందని తమరు ఎలా నమ్మారో మాకు అర్థం కావట్లేదు. 

-> తగలబెట్టడం తమరికి అలవాటేమో, అందరూ తమరిలానే చేస్తారని అనుకుంటే ఎలా? నిన్న చూశారుగా అధికార దర్పం, అహంకారం ఎంతగా ప్రదర్సనించినా కూడా నిరసనకారులు ఎటువంటి అసాంఘిక, హింసాత్మక ప్రతిచర్యలకు పూనుకోలేదు. దానిని మీ విజయంగా చెప్పుకుంటున్నారు, అది వారి సంయమనం. అందులో యే కొద్దిపాటి తమకు అలవడినా బావుంటుంది. సుజనా చౌదరి లాంటివారు తెలీకనో, తెలివిలేకనో, పథకం ప్రకారమో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా కూడా వారు రెచ్చిపోలేదు, అది సంయమనం అంటే.  

-> 'ముఖ్యమంత్రినయితే ఇలా చేస్తారా?' అన్న వాక్యాన్ని జాతిగొట్టాలు తమకు అనుకూలంగా మార్చుకుని చిత్తానికి తోచినట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం అనుమతిలేని, కేంద్రప్రభుత్వ అధీనంలో ఉండే విమానాశ్రయంలోని రన్ వే పైకి మఫ్టీలో రాష్ట్ర పోలీసులు ఎవరి అనుమతితో వెళ్ళారు? ప్రతిపక్షనేతను విఐపీ లాంజ్ లోనో, బయటకు వచ్చే సందర్భంలోనో అరెస్ట్ చేయవచ్చు లేదా నగరంలోకి వెళ్లకుండా నిర్బంధించవచ్చు. అవేమీ చెయ్యకుండా రన్వే పైనే ఆపివెయ్యాల్సినంతటి అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? మరి ఎందుకు ఆ అరాచకాన్ని గురించి మాట్లాడటం లేదు. ఇదే సన్నివేశంలో చంద్రబాబు ఉండి ఉంటే పోలీసుల దాష్టీకం గురించి చిలువలు పలువలుగా కథనాలు వండి వార్చేవారు. గతంలో మహారాష్ట్ర పోలీసులపై బాబు గారు వీరంగం వేసినా కూడా అది ప్రజలకోసమే. వేరే ఎవరు చేసినా అది తప్పు. అభిప్రాయాలు పక్కనబెట్టి కనీసం ఒక్కసారైనా వార్తను వార్తగా చూపరా? 

-> ఒక వ్యక్తి నచ్చకపోతే లేదా ఒకవ్యక్తిని తమరు ఒక రకంగా భావించినచో ఆ ప్రాంతమంతా అలానే అంటే ఎలా? ప్రతిసారీ కడప (లేదా రాయలసీమ) రౌడీలు అనడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా పెద్ద ఎన్టీఆర్ కి తమరు వెన్నుపోటు పొడిచారు అన్నది నిజం. అది రాష్ట్రం లేదా పార్టీ మంచికోసం అని తమరు చెప్పవచ్చుగాక కానీ స్వయంగా పెద్ద ఎన్టీఆర్ అది వెన్నుపోటు అని బాధపడ్డారు కూడా. మరి తమరి ప్రాంతం వాళ్లంతా వెన్నుపోటుదారులు అంటే ఊరుకుంటారా? వయసు, స్థాయితో పాటు కాస్త సంయమనం పెరగాలి. 

... ఇప్పటికి చాల్లే, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ కలుసుకుందాం.

Comments

Popular posts from this blog

... మూడు బెత్తం దెబ్బలు

... తెలుగోడి శతృవు

... ఎవరి తప్పులు/ఆశలకు ఎవరు బాధ్యులు?